కరిగిపోతున్న "కుప్టి ప్రకృతి" అందాలు..!
By
Vaasthava Nestham
• పచ్చని గుట్ట అన్యక్రాంతం..
• పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు
• మొరం మాఫియాకు కాసులు కురిపిస్తున్న కుప్టి గుట్టలు
• టిప్పర్ల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా మొరం తరలింపు
• కనుమరుగు కానున్న ప్రకృతి సంపద
• రాత్రి సమయాల్లో జోరుగా అక్రమ మొరం దందా
• పట్టించుకోని సంబంధిత అధికారులు
• అన్ని తెలిసి మౌనం వహిస్తున్న అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా అంటేనే పచ్చదనానికి పెట్టింది పేరు. అడవులు.. కొండలు... గుట్టలు.. అందమైన జలపాతాలు.. నాలుగు వరుసల జాతీయ రహదారుల వెంట ప్రకృతి రమణీయమైన గుట్టలు..సెలయేళ్ళు... కిలకిల పక్షుల రాగాలు.. చెంగు చెంగున ఎగిరే వన్యప్రాణులు... ఇవన్నీ అదిలాబాద్ జిల్లాకు మణిహారం. పర్యాటక ప్రేమికుల మనసులను ఇట్టే ఆకట్టుకుంటాయి. వారిని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అలాంటి ప్రకృతి సంపదపై కొందరి కన్ను పడింది.. సంపదను దోచుకెళ్తున్నారు.. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని తెలిసి కూడా సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదిలాబాద్ టు నిర్మల్ వైపు వెళ్లే నాలుగు జాతీయ రహదారి నేరడిగొండ మండలంలోని కుప్టి గుట్ట అన్యాక్రాంతం అవుతుతోంది. గుట్టల మధ్యలో కొందరు బడ బాబులు చొరబడ్డారు. అక్రమంగా క్వారీలను ఏర్పాటు చేసారు. విలువైన ఎర్ర మొరం ను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ జేబులు నింపు కుంటున్నారు.
టిప్పర్ల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా మొరం తరలింపు...
కుప్టి ప్రాంతంలో ఎర్ర మొరం నాణ్యమైనది కావడంతో కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యల్లో పెద్ద పెద్ద టిప్పర్ల ద్వారా ఎర్ర మొరంను తరలిస్తుండడంతో వీరి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరబూస్తోంది. ఈ ప్రాంతం దగ్గరగా ఉండటం దీనికి తోడు మెరుగైన రోడ్డు సౌకర్యం ఉండటం వరంగా మారింది. పగలు, రాత్రులు అనే తేడా లేకుండా తక్కువ సమయంలో ఎక్కువ ట్రిప్పులు తీసుకెళ్తూ లాభాలను అర్జిస్తున్నారు. ఒక్కొక్క టిప్పర్ మొరం కు రూ.6 వేల నుంచి రూ.8 వెల్ వరకు విక్రయిస్తున్నారు. రాత్రి సమయాల్లో అయితే అడ్డు అరుపు లేకుండా టిప్పర్ల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా మొరం తరలించి లక్షలు గడిస్తున్నారు.
నేలకొరుగుతున్న పచ్చని చెట్లు...
కుప్టి గుట్టల మధ్య అక్రమ క్వారీల నేపథ్యంలో విలు వైన పచ్చని చెట్లు నేలకొరుగుతున్నాయి. పకృతిని కాపాడేందుకు ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తుంటే.. ఇక్కడ మాత్రం అక్రమార్కులు ఉన్న ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు. అక్రమ క్వారీలతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాకరంగా మారాయి. దట్టంగా ఉన్న గుట్టలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ విధ్వంసం ఇలాగే కొనసాగితే కుప్టి గుట్ట ఆనవాళ్లు కనిపించే పరిస్థితి లేకుండా పోతుంది. మరో వైపు ఎర్ర మొరం కోసం పోటా పోటీగా వెళ్తున్న టిప్పర్ల మూలంగా గ్రామాల్లోని ప్రధాన రహదారులు దెబ్బతింటున్నాయి. ఎర్ర మొరం అక్రమ దందాను అధికారులు అరికడుతారో... లేక అక్రమార్కులకు వత్తాసు పలుకుతారో వేచిచూడాలి మరి...!
Comments